Wednesday, July 22, 2015

వైవిధ్యమే జీవం!

                                                 వైవిధ్యమే జీవం!
ఈ సృష్టి ఒక నాటక రంగం. సకల ప్రాణులు ఆ జీవన్నాటకంలో పాత్రధారులు.ఏనుగు మొదలు చలిచీమ దాకా..ప్రతిపాత్రా కీలకమైందె. ఏ ఒక్కటి లేకపోయిన వైవిధ్యం దెబ్బతింటుంది.నాటకం రసాభాస అవుతుంది.

నిషి! మనిషి! మనిషి!..

..జీవవైవిధ్య న్యాయస్థాన బంట్రోతు గొంతుచించుకుంటున్నడు. " నేనేలేవయ్యా! ఆ మనిషిని " అంటూ చికాకుచికాగ్గా ఊబకాయుడూ అధిక రక్తపోటు బాధితుడూ అయిన ఓ శాల్తీ బోనెక్కాడు.ముద్దాయిగా నిలబడాల్సి వచ్చిందన్న పశ్చాత్తాపం అతన్లో ఏ కొశానా లేదు. కోటు సర్దుకున్నాడు. టై సవరించుకున్నాడు.టిష్యూ పేపరుతో మొహం తుడుచుకున్నాడు.కోర్టుగదిలో ఏసి లేదన్న చికాకు మొహంలో ప్రస్పుటంగా కన్పిస్తుంది.ఆ తాపానికి,భూతాపానికి కూడ తానే కారణమన్న సంగతి మాత్రం ఏనాడో మరచిపోయాడు.తెలిసిన మూర్ఖుడంటె మనిషే!
సందర్శకుల స్థానంలో ...నదులు,సముద్రాలు.అడవులు,పర్వతాలు,పంటపొలాలు దిగాలుగా కూర్చున్నాయి.సకల జీవకోటికి సాక్షులుగా వచ్చాయవి.మనిషిని చూడగానే జీవరాశి కోపం కట్టలు తెంచుకుంది.వీడే.. ఆ దుర్మార్గుడే, ఈ స్వార్థపరుడే.. అంటూ పాములు బుసకొడుతున్నాయి.కందిరీగలు కరిచేద్దామ అన్నంత కోపంతో ఊగిపొతున్నాయి.చిరుతలు చిర్రుబుర్రులాడుతున్నాయి.శాంతస్వాభావులైన పిచ్చుకలకూ కోపమొచ్చింది.శాపనార్థాలు ఊపందుకున్నాయి.ఓ దశలో ఎవరేం మట్లాడుతున్నారో అర్థంకాని పరిస్థితి.
  అంతలోనె న్యాయమూర్తి వచ్చారు.అంతా నిశబ్దం.
 


' జీవకోటి వర్సెస్ మనిషి. ఒకటో ముద్దాయి నుంచి వందో ముద్దాయిదాకా - అన్ని మానవుడే... ' కేసు వివరాలు కోర్టుముందుంచాడు గుమస్తా.
సకల జీవరాశి తరపు న్యాయవాది గొంతు సవరించుకున్నాడు..

"యువర్ ఆనర్! కోట్ల సంవత్సరాల క్రితం సృష్టి ఉద్భవించింది.మెల్ల మెల్లగా కొండలూ కోనలు ప్రాణంపోసుకున్నాయి.ఎనభై నాలుగు లక్షల జీవకోటికి అవి అవాసంగా నిలిచాయి.అప్పట్లో సృష్టిలో ఎంతో వైవిధ్యం ఉండేది.మహా అయితే ఇరవై లక్షల సంవత్సరాల క్రితమే, మనిషనే వాడు పుట్టాడు.మనిషి మనిషనిపించుకోడానికి ఇంకొంత సమయం పట్టింది.పారే ఏరు,పరుగెత్తే జింక ,అనంత సముద్రం ,ఉదయించే సూర్యుడు,అస్తమించే చంద్రుడు,మెరిసే నక్షత్రాలు...ప్రతీది అతనికి వింతే.కళ్లప్పగించి చూసేవాడు.వాటన్నిటి వెనుకా ఏదో నిగూడ శక్తి ఉందని భావించేవాడు.తరచూ భయపడేవాడు.ప్రకృతి తనకంటే చాలాచాలా శక్తిమంతమైందని బలంగా విశ్వశించేవాడు.దేవతగా ఆరాధించేవాడు. ఇదంతా తొలిదశ.
     మెల్లమెల్లగా ప్రకృతితో చనువు పెరిగింది.నదుల్ని ఈదాడు.జీవుల్ని మచ్చిక చేసుకున్నడు.నక్షత్ర గమనాన్ని అర్థం చేసుకున్నడు.ప్రకృతితో దోస్తీకట్టాడు.ఇది రెండో దశ.

    ఏనుగునైన గడ్డిపోచతో బంధించవచ్చు.సింహాన్నికూడా శూలాలతో భయపెట్టవచ్చు.ఆత్మవిశ్వాశం ఉంటే సముద్రాన్నీ కూడ లంఘించవచ్చు.అడవి ఇస్తే ఎంత,ఇవ్వకపోతే ఎంత...పండించుకుని అయిన తినవచ్చు.


ప్రకృతి గుట్టుమట్లు తెలుసుకొంటున్నకొద్దీ అతని గుండెధైర్యం పెరిగింది.అహంభావంతో విర్రవీగుతున్నవాడికి,ప్రకృతి పుట్టుబానిసల కనిపించింది.ప్రార్థించడం మానేశాడు.ఆదేశించసాగాడు.కర్రపెత్తనం మొదలయింది.నదుల హ మీదా,సముద్రాల మీదా పర్వతాల మీదా తనకేదో హక్కున్నట్లు ప్రవర్తించాడు.ఎంత దోచుకోవాలో అంతా దోచుకున్నాడు.ఎంత నాశనం చేయాలో అంతా నాశనం చేశాడు.విశృంఖలత్వానికి పరాకాష్ట అది.ఆ బాధల్ని ప్రకృతి పంటిబిగివున ఆపుకుంది,గుండెమాటున దాచుకుంది.సహనానికైన హద్దుంట్టుంది.ఇంకాయింకా భరిస్తూపోతే...విలయమే,ప్రళయమే!



     సృష్టిలో తాను చాల ప్రత్యేకమని విర్రవీగుతున్నాడు మనిషి.అది అబద్ధం.శుద్ద అబద్ధం.ప్రకృతికి చలిచీమ ఎంతో,మనిషి అంతే.కొరమీనం ఎంతో మనిషీ అంతే.ఎక్కువా కాదు,తక్కువా కాదు.మనిషి ఉన్న లేకపోయిన ప్రకృతికొచ్చిన నష్టమేం లేదు. అదే ప్రకృతి లేకపోతే,మనిషి లేడు.అతని ఉనికి లేదు.ప్రతికూల పరిస్థితుల్ని తట్టుకుని నిలబడటంలో తానేదో మహా సమర్థుడినన్నట్లు పోజుకొడుతున్నాడు కానీ,బాక్టీరియా కంటే కూడ బలహీనుడతను.తక్కిన ఏ ప్రాణులూ బతకలేని పరిస్థితుల్లో కూడ బాక్టిరియా మంచుకొండల్లో ఉండగలదు.అగ్ని పర్వతాల్లోను తలదాచుకోగలదు.మరి మనిషో..చిన్న సమస్య వచ్చినా ఉక్కిరిబిక్కిరైపోతాడు.

      వైవిద్యమే.. ప్రకృతి విజయరహస్యం!
చేయితిరిగిన రచయిత రచయిత పాత్రల్ని సృష్టించినంత ఒడుపుగా..జీవరాశులకు ప్రాణం పోశాడు సృష్టికర్త! ఆ సూక్ష్మాన్ని గ్రహించలేకపోయాడ అహంభావి.ఎన్నో జీవజాతుల అంతర్ధానానికి తనే కారణమవుతున్నాడు.జాతికొకటి చొప్పున కేసులు నమోదు చేసినా, ఈ మనిషిని వేలసార్లు ఉరితీయాలి.." ఆవేశంగా వాదించావడు న్యాయవాది.

      జీవవైవిధ్య న్యాయమూర్తి శ్రద్ధగా ఆలకిస్తున్నారు.మధ్యమధ్యలో ముఖ్యమనిపించిన అంశాల్ని నమోదు చేసుకుంటున్నారు.ఓసారి కోర్టు గదంతా పరికించి చూసి, 'సాక్షుల్ని ప్రవేశపెట్టండి.. ' అని ఆదేశించారు.

అడవితల్లి ఆక్రందన....

పచ్చని వనలక్ష్మి ఎండుపుల్లల తయారయింది.మొహం నిండా నైరాశ్యం.గత వైభోగం లేదు.నిన్నటి కాంతుల్లేవు.చూపులెటో.ధ్యాసెటో. ' చెప్పండి, మీ కష్టాలకు కారణమెవరు? '... న్యాయమూర్తి ఆత్మీయతకు ఆమె కరిగిపోయింది.ఏడుపొచ్చేసింది.చీరకొంగుతో కళ్ళు తుడుచుకుంటు తన కథంతా వివరించింది... " నన్ను అడవితల్లి అంటారు.వనదేవతగా కొలుస్తారు.అడవిలోని సకల జీవరాశులు నా బిడ్డలే అనుకున్నాను. చెట్లూ చేమలూ నా చుట్టాలనుకున్నాను.సంతతి పెరుగుతున్నకొద్దీ సంబరమే.పచ్చదనం విస్తరిస్తున్నకొద్దీ పండగే.! మనిషి నాగరికుడవుతున్న క్రమంలో అడవిని నరికేసి గ్రామాల్ని నిర్మించుకున్నాడు.వన్యమృగాల్ని వేటాడి కడుపు నింపుకున్నాడు.అయినా నేను బాధపడలేదు.వేల ఏళ్ల క్రితం..ఆదిమ దశలో జంతువుల మధ్య జంతువుగా నా ఒళ్లో పెరిగిన బిడ్దే కదా..మనిషంటే!
తల్లిగా సహనం లేకపోతె ఎలా అనుకున్నాను.ఆలోచన పెరిగేకొద్దీ తెలివిమీరసాగాడు.అడవంటే అబ్బసొత్తనుకున్నాడు.అతని కళ్లు వన్య మృగాల మీద పడ్డాయి.తోలుతీసి అమ్ముకోడానికీ,బొమ్మను చేసి అలంకరించుకోడానికి ఎన్నో అమాయక ప్రాణుల్ని పొట్టన పెట్టుకున్నాడు.జాతులకు జాతులే అంతరించిపోయాయి.ఇంకొన్ని అంతరిస్తున్నాయి.అలా అని,రాయిల రప్పలా సృస్టిలోని ప్రతీజీవీ శాశ్వతంగా ఉండాలని నేనేం కోరుకోవడం లేదు.మరణం కూడా పరిణామంలో భాగమే అంటాడు రిచర్డ్ డాక్సన్ అనే శాస్త్రవేత్త.నా అభిప్రాయం కూడ అదే.అంతపెద్ద డైనోసార్లే అంతమైపోయాయి.కానీ అది ప్రకృతి పరిణామంలో భాగంగా జరిగింది.ఇప్పటి మారణకాండకు మూలం మనిషి స్వార్థం.
ఇందులో కొన్ని... ప్రత్యక్ష హత్యలు.నేరుగ కత్తులతోనో బందూకూలతోనో చంపేస్తున్నాడు.ఇంకొన్ని పరోక్ష హత్యలు.మనుగడ సాగించలేని పరిస్తితి కల్పించి ,జీవుల అంతానికి కారణం అవుతున్నాడు.గనుల తవ్వకాలూ రైల్వేలైన్లూ రోడ్డుమార్గాలూ పారిశ్రామీకరణ...అడవి జీవులకు అవరోధాలు సృష్టిస్తున్నాయి.శబ్ద,వాయు కాలుశ్యాన్ని కల్పిస్తున్నాయి.చెట్లు నరికేస్తే పిట్తలు గూళ్లెలా కట్టుకుంటాయి? ఆవాసం వెతుక్కుంటూ దిక్కుకొకటి వెళ్లిపోతాయి.అక్కడమాత్రం అనువైన పరిస్థితులు ఉంటాయన్న భరోసా లేదు.

అడవంటే పులే గుర్తుకొస్తుంది.ఎంత దర్జా! ఏం రాజసం! నేటి పరిస్థితుల్లో పులిరాజాలు కూడ బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి.నక్కినక్కి నడవాల్సిన దుస్థితి.ఏ వేటగాడు గురిపెడతాడో,ఏ చర్మాల వ్యాపారి వల విసురుతాడో..అన్న భయం.! పదేళ్ల క్రితం దేశంలో దాదాపు నాలుగువేల పులులుండేవి.మరి ఇప్పుడో! పదిహేను వందలలోపే. పులికి అనేకానేక అడవి జంతువులు ఆహరం. ఆ జీవులకు ఇంకేవో ప్రాణులు ఆహారం. దీంతో జీవరాశుల మధ్య ఒక రకమైన సమతౌల్యం ఏర్పడేది.ఇప్పుడ అవకాశం లేదు.ఎలుగుబంట్లు ఊళ్ళ మీదకి వస్తున్నయన్నా, ఏనుగులు పొలాల్లోకి వస్తున్నయన్నా..కారణం ఆ అసమతౌల్యమే!

అడవి దాటిందంటే ...పులి కూడ పిల్లే.ఏనుగైన చిట్టెలుక అంత బలహీనపడిపోతుంది.పరుగుల జింక.. ఎక్కడో ఓచొట బొక్కబోర్లాపడుతుంది.ఒక ఊరి రాజు, మరొ ఉర్లో సేవకుడు.స్థానబలం ఎక్కడలేని శక్తినిస్తుంది.వన్య జీవులకు సంబంధించినంతవరకూ...అడవే ఒక స్వర్గం,ఒక దుర్గం.అడవిలొ చెట్లూ - వన్యమృగాలూ చెట్టాపట్టాలేసుకుని బతుకుతాయి.ఏ పులో సింహమో అటూ ఇటూ తిరుగుతుంటే ...నరమానవులు ఆఏ పరిసరాల్లోకి కూడ రాలేరని చెట్లకు ధైర్యం.దట్టమైన్ చెట్ల మధ్య చేయితిరిగిన వేటగాడినైన మూడుచెరువుల నీళ్ళు తాగించవచ్చని వన్య మృగాల విశ్వాసం.చెట్లేమో నేలకూలుతున్నాయి.జీవరాశులేమో క్రమక్రమంగా కనుమరుగు అవుతున్నాయి.ఆ రెంటినీ  ప్రేమించే గిరిపుత్రుల్ని తరిమితరిమి కొడుతున్నారు . ఇంకేముంది, అడవి చిక్కి శల్యమైపోతుంది. మా ఉఎఉరు పోసుకుని.... ఎన్నళ్లని సంతోషంగా ఉంటాడీ మనిషి! అడవులు నాశనమైపోవటం వల్లే కదా.. భూమి వేడెక్కుతుంది. వరదలు ముంచెత్తుతున్నాయి. భూసారం క్షీణించిపోతుంది . భవిష్యత్తులో ఇంకెన్ని విపత్తులొస్తాయో! మా విన్నపం ఒక్కటే... అడవి ఏ ఒక్కరి ఆస్తీ కాదు. ఆ చెట్లనెవరూ నాటలేదు. ఆ ప్రాణుల మీద ఎవరికీ అధికారం లేదు. జీవజాలానికెవరూ కూడుపెట్టి పెంచలేదు.మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి " వెక్కివెక్కి ఏడుస్తూ బోనులోనే కూలబడిపోయిందా శోకదేవత.

......జలఘోష.....
    సముద్రం అంటేనే గాంభీర్యం. ఎన్ని సునామీలను భరించి ఉండాలి?! ఆటుపోట్లతో రాటిదేలిన సముద్రడంతటివాడే...... మనిషి దాడిని తట్టుకోలేక వణికిపోతున్నాడు. సృష్టిలోని జలసంపదకు ప్రతినిధిగా, నదీనదాలకు పెద్దదిక్కుగా సముద్రుడు బోనెక్కాడు.....
    " ఏం చెప్పమంటారు దేవరా! మలినాల్ని శుభ్రం చేసే జలమే పరమ మురికిగా తయారైంది . నిన్నమొన్నటిదాకా ' గంగేచ యమునేచ... అంటూ చేతులెత్తి మొక్కినవాళ్ల్లే , ముక్కు మూసుకుని దాటుకెళ్తున్నారు. జలం విషమయమైపోయింది . నదులు మురికి కూపాలయ్యాయి. సముద్రం.... మలినాలకు మజిలీగా మారుతుంది. సముద్రపు ఉప్పు తిన్నానన్న కృతఙ్ఞత కూడా లేదీ మనిషికి. మరయంత్రాల సాయంతో మారణహోమం సృష్టిస్తున్నాడు. విచక్షణ లేకుండా వేటాడుతున్నాడు . సముద్రజీవుల ఎగుమతులతో కోట్లకుకోట్లు కూడబెట్టుకుంటున్నాడు. ఆ దాడిలో చేపలే కాదు ...... అరుదైన జలచరాలూ నాశనమైపోతునాయి. చుక్కలనంటే అంతర్జాతీయ మార్కెట్ ధరలు నక్షత్ర తాబేళ్ల్లను మింగేస్తున్నయి.
 నీటిగుర్రం తదితర జీవుల్లోని ఔషధ గుణమే వాటికి శాపంగా మారింది . అణుకాలుష్యం మొదలుకొని , పారిశ్రామిక వ్యర్ధాల దాకా..... అన్నీ సముద్రంపాలే. దీంతో జలాశయాలో జీవవైవిధ్యం బాగా తగ్గిపోతుంది. పుణ్యనదుల్ని కలుషితం చేసిన పాపమూ మనిషిదే. ఆ దెబ్బకి గంగమ్మతల్లే గుక్కతిప్పుకోలేకపోతుంది . పంట పొలాల్లో కుమ్మరించిన రసాయనాలూ క్రిమి సంహారకాలూ... వాగూ వంకల్లోని జలచరాల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పారిశ్రామిక వ్యర్ధాల్ని, మలమూత్రాల్నీ కలిపేస్తున్నారు. దీనివల్లన నదుల్లోని మత్స్యసంపద సర్వనాశనమైపోతుంది. మిగిలిన కొద్ది జాతులూ విషతుల్యం అవుతున్నాయి. మంచినీటి చేపల్లో 70% ...ఉనికి ప్రశ్నార్ధకం అవుతుంది.
    జలాశయాల్ని ఆవాసం చేసుకుని మనుగడ సాగిస్తున్న రకరకాల జీవులు నీటిలోని చెడు కీటకాలని తినేసేవి. దీంతో ఎంతో కొంత శుభ్రమైన నీరు ప్రజలకు అందేది. ఇప్పుడా అవకాశం ఏది?! ఏ కొద్దిమందో చేసిన ఖర్మ, అంతా అనుభవిస్తున్నారు.... గద్గద స్వరంతో గోడంతా వెళ్ల్లబోసుకున్నాడు సముద్రుడు.
న్యాయమూర్తి మొహంలో కలవరం. అదీ ఓ నిమిషమే. వెంటనే సర్దుకున్నారు. మరో సాక్షిని పిలిపించమని ఆదేశించారు..

<<<<....పంట_మంట ....>>>>>>

    జొన్నన్నం, సజ్జరొట్టెలు, గోధుమరవ్వ, పాయసం, రాగి సంకటి, కొర్రబువ్వ... ఎన్ని రుచులు! ఎన్ని ఆహారధాన్యాలు! ఎంత వైవిధ్యం! ఎంత ఆరోగ్యం! ఎన్ని పోషక విలువలు! అదంతా ఏమైపోంది? పంటల వైవిధ్యం కూడా జీవ వైవిధ్యంలో భాగమే. ఒక్కో పంట ఒక్కో పక్షిజాతిని ఆకర్షిస్తుంది, బతికిస్తుంది. అలా రకరకాల రెక్కల చప్పుళ్ల్లు! ఒక్కో పంట పశుగ్రాసంలో ఒక్కో పోషక విలువ..అలా ఆరోగ్యమైన పశుసంపద! వాటి విసర్జితాలు పొలానికి బలమైన ఎరువులు. వ్యవసాయరంగంలోని పరిస్థితుల్నిజీవవైవిధ్య న్యాయమూర్తికి వివరించింది ధాన్యలక్ష్మి. ఆమె మాట్లాడుతుంటే... ఎండు గింజల్ని చాటలో చరుగుతున్నంత శ్రావ్యత.
     " గ్రామాల్లో ఎంత సందడిగా ఉండేది! పక్షుల కిలకిలలు, కోళ్ల కొక్కరకోలు , ఆవుల అంబాలు, బసవన్నల రంకెలూ.. వ్యవసాయమంటే పండించుకుని తినడమేనా, పంచుకుని తినడం కూడా. భూమితల్లి దోసెడు గింజలు ఇస్తే పిడికెడైనా పంచుకోవాల్సిందే! గడ్డి పశువులకెళ్తుంది, తాలు పక్స్శులకెళ్తుంది, పరిగి బీదాబిక్కీ ఏరుకుపోతారు. రైతే రాజు..అంటారు. రాజంటే సంపన్నుడని కాదు, నలుగుర్నీ పోషించేవాడని అర్ధం. ఒకప్పుడు రైతన్న పదివేల రకాల పంటలు పండించేవాడట! ఇప్పుడా సంఖ్య 200 లోపే. దేశీధాన్యాల్లో చాలావరకు చరిత్రలో కలిసిపోయాయి. వైవిధ్యాల్ని నమ్ముకుంటేనే... సేద్యానికి జవం , జీవం! ఏ వాణిజ్య పంటో అయితే ఇంత సందడి ఉండదు. లక్షలకు లక్షలు కుమ్మరించిన రైతన్నకు కంటిమీద కునుకెక్కడిది? వస్తే పంట, రాకపోతే కడుపుమంట! సేద్యాన్ని ఫక్తు జూదంగా తయారుచేస్తున్నాయి బహుళజాతి విత్తనాలు. ఇక రసాయనాలూ క్రిమిసంహారకాలైతే... మట్టిని విషపు ముద్దగా మార్చేస్తున్నాయి. మేతకెళ్లిన ఆవులూ గేదెలూ గొర్రెలూ మేకలూ..ఆ కాలకూట విషప్రభావంతో కుప్పకూలిన దాఖలాలున్నాయి. మట్టినే నమ్ముకున్న వానపాములూ కప్పలూ ఎండ్రగప్పలూ మట్టిలోనే కలిసిపోతున్నాయి. మొక్కల సంపర్కానికి దోహదపడే కీటకాలు మాడిమసైపోతున్నాయి.
    నిన్నమొన్నటిదాకా... దోమల గుడ్లు తిని కప్పలు బతికేవి. కప్పల్ని తిని పాములు బతికేవి. పాముల్ని వేటాడి గద్దలు కడుపునింపుకుకేవి. పిచ్చుకైతే రైతుచేతిలోని బ్రహ్మస్త్రమే! మిడతలదండు నుంచి పంటను కాపాడేది. మనిషి స్వార్ధం కారణంగా ఆ చక్రం చిన్నాభిన్నం అయిపోయింది. పాముల తోలు ఒలిచి ఫ్యాషన్ వస్త్రాలు అల్లుకుంటున్నారు. దీంతో గద్దలకు ఆహారం కరువైంది. ఏ వ్యవసాయ కుంటల్లోని చేపల్నో తిని ... క్రిమిసంహారకాల ప్రభావంతో చనిపోతున్నాయి. మట్టిని బంగారంగా మార్చే పరుసవేది విద్య తెలిసిన వానపాములు కూడా పలుచబడిపోయాయి. ప్రతీ ఇరవై నిముషాలకు ఒక జీవజాతి అంతరించిపోతున్నట్టు అంచనా. ఇంతా చేసి మనిషైనా సుఖపడ్తున్నాడా అంటే .... అదీ లేదు. విత్తనాల కోసం వీధుల్లో నిలబడాల్సిన దౌర్భాగ్యం. తిండిగింజల కోసం రేషన్ షాపు ముందు బారులు తీరాల్సిన దారిద్ర్యం. ఆత్మహత్యలు సర్వసాధారణమైపోయాయి. వలసలు తప్పడం లేదు. ఎందుకు ఇన్ని కష్టాలు్..ధాన్యలక్ష్మిని ఓదార్చటం ఎవరి వలనా కాలేదు.
    అందరి వాదనలూ విన్న న్యాయమూర్తి తీర్పు చెప్పటానికి సిద్ధమౌతుండగా ' మా బాధ కూడా వినండి ...' అంటూ తేనెటీగలు విజ్ఞాపన పత్రం సమర్పించాయి. అయ్యా... కొండంత అండ అన్న మాట వింటే ఏడుపొస్తుంది. ఏడ్వలేక నవ్వొస్తుంది.ఈ మనిషి కొండల్ని కూడా పిండిచేస్తున్నాడు. అక్కడా జీవవైవిధ్యం లేకుండా చేస్తున్నాడు. తెలియంది ఏముంది! మేం శ్రమజీవులం. కొండాకోనలు తిరిగి.. మకరందాన్ని సేకరిస్తాం. ఈ మధ్య కొండల మీద కూడా సెల్ ఫొన్ టవర్లు ఏర్పాటు చేస్తున్నారు. రేడియేషన్ ప్రభావంతో మా సంతతి నశిస్తోంది. తేనె ఉత్పత్తి బాగా పడిపోతుంది ' అని విన్నవించుకుందో నల్లమల తేనెటీగ. హిమాలయాలు మొదలు పశ్చిమ కనుమల దాకా...కొండలూ గుట్టలూ 'అవును అవును మా ఉనికీ నాశనమైపోతుంది. ఎన్నో ఔషధమొక్కలు కనిపించకుండా పోతున్నాయి.ఎర్రచందనం రక్తమోడుతుంది. కలప గడప దాటుతుంది. అరుదైన జీవజాతులు మాయమైపోతున్నాయి" అంటూ ఆవేదన వ్యక్తం చేసాయి.
అంతిమ తీర్పు.....
' యాభైకోట్ల సంవత్సరాలలో... ఐదుసార్లు విస్ఫోటనాలు సంభవించాయి. ఐదో వినాశనం అరవై ఆరు మిలియన్ సంవత్సరాల క్రితం జీవరాశిని సమూలంగా నాశనం చేసింది. ప్రకృతిలో వచ్చిన అనూహ్యమైన మార్పులూ ఉల్కాపాతాలే వీటికి కారణం. ఆరోసారి... ఏదైనా తీవ్ర ఉత్పాతం సంభవించిందంటే మాత్రం, దానికి బాధ్యుడు మనిషే '.
    'అలా అని , వేల సంవత్సరాల వెనక్కి వెళ్లిపోయి... కొండల్లోనో కోనల్లోనో బతకమనీ అనటం లేదు. జీవవైవిధ్యానికి ప్రాధాన్యం ఇస్తూనే సుస్థిరమైన అభివృద్ధిని సాధించడం సాధ్యమేనని చెబుతున్నాను. ' బతుకు - బతకనివ్వు '....నీ నినాదం కావాలి. ఇప్పటిదాకా ఆధినిక సాంకేతిక పరిజ్ఞానాన్నంతా నీ అవసరాలకూ విలాసాలకే ఉపయోగించుకున్నావు. ' ప్రకృతి కోసం టెక్నాలజీ ' అన్న కోణం నుంచీ ఎందుకు ఆలోచించకూడదు.నీ మఏధస్సుకు పదును పెట్టి...పారిశ్రామిక వ్యర్ధాల్ని తగ్గించుకో, కాలుష్యానికి కళ్లెం వేసుకో, చెత్తను సద్వినియోగం చేసుకునే మార్గం కనిపెట్టు. ఆ మాత్రం ఉపకారం చేసావంటే అదులు నిమ్మళంగా పారుతాయి. సముద్రాలు సంతోషంగా ఊపిరిపీల్చుకుంటాయి.గాలీ వెలుతురూ స్వచ్ఛ్ంగా ఉంటాయి.
    ' తూతూమంత్రంగా ముట్టజెప్పి తరలించుకుపోతున్న ఔషధమొక్కలతో, అరుదైన సముద్ర జీవులతో ... కోట్లవిలువైన మందులు తయారుచేసుకుంటున్నాయి విదేశీ కంపెనీలు. ఆ ముడిపదార్ధాల్ని మనమే ఎందుకు ఉపయోగించుకోకూడదు? దీని వలన ప్రభుత్వానికి ఆదాయం. ప్రజలకూ ఉపాధి. ఒకటేమిటి, జీవవైవిధ్యానికి తెఎవ్త నష్టం కలిగించకుండానే ఆర్ధిక ప్రగతి సాధించటానికి చాలా మార్గాలున్నాయి. ఆ దిశగా ఎప్పుడైనా దృష్టి సారించావా? '
' సృష్టిలో 3 కోట్ల వృక్ష, జంతుజాతులున్నాయి. ఇప్పటిదాకా గుర్తించింది మహా ఐతే పదీ పదిహేనులక్షలు. మిగిలినవన్నీ వృధాగా పడున్నాయి. నీ లోని సాంకేతిక పరిజ్ఞానానికిన్రెక్కలు తొడిగి .... అన్నింటినీ వర్గీకరించు. వాటిలోని ప్రత్యేకతల్ని అర్థంచేసుకో. మానవజాతికి అవెలా ఉపయోగపడతాయో ఆలోచించు. దీని వలన మిగతా జీవులపై ఒత్తిడి తగ్గుతుంది.ప్రకృతి మీద భారం పెరగటానికి ప్రధాన కారణం... అధిక జనాభా! భారత్ లాంటి పెద్ద దేశాలు కూడా నియంత్రించాల్సిన స్థాయిలో జనాభా పెరుగుదలను నియంత్రించటం లేదు. ఇదే వేగంతో జనాభా పెరిగితే....అడవి జంతువుల్నే కాదు, తోటి మానవుల్ని కూడా పీక్కుతినాల్సిన పరిస్థితి వస్తుంది, జాగ్రత్త!
    అడవుల్ని ఆక్రమించీ నదుల్ని పిండుకొనీ కొండల్ని తవ్వుకొనీ సముద్రాన్ని మధించీ... పిల్లల కోసం, ఆ పిల్లల పిల్లల కోసం వేల కోట్లు కూడబెడతావు. బంగళాఉ కట్టిస్తావు. అంతవరకు బాగానే ఉంది , కానీ ఆందాన్ని స్విస్ బ్యాంకులో దాచిపెట్టగలవా? ఆర్రోగ్యాన్ని బంకర్లలో భద్రపరచగలవా??? ఎందుకంటే ... రేపటి భాగ్యం, ఆరోగ్యమే! కాలుష్యం కాటేయటానికి సిద్ధంగా ఉంది. కరువుకాటకాలు కాచుకుని కూర్చున్నాయి. మాయరోగాలు ముసురుకుంటున్నాయి.ప్రకృతి మీద ప్రేమ ఉన్నా లేకపోయినా, పుత్రపౌత్రుల కోసమైనా... వైవిధ్యానికి విలువనివ్వు.
                   ఇది నీ బాధ్యత.
                   ఇది నీ అవసరం.
                   ఇది నీ జాతి మనుగడ సమస్య ".
    హెచ్చరించాల్సిన చోట హెచ్చరిస్తూ, బుజ్జగించాల్సిన చోట బుజ్జగిస్తూ జీవవైవిధ్య న్యాయమూర్తి తీర్పునువెఎలువరించారు.
    అంతా విన్న మనిషి ... నిశ్శబ్దంగా నిష్క్రమించాడు. మొహంలో ఏ మూలనో కాస్తంత పశ్చాత్తాపం. మార్పునకు ఇది తొలి సంకేతం కావచ్చు..
                                                 ప్రకృతి రక్షతి రక్షిత :



























No comments:

Post a Comment